|
|
|
|
| మూడువేలకు పైగా ఉన్న తిరుమల శ్రీవారి ఆభరణాలను బీమా చేయాలని సోమవారం జరిగిన పాలకమండలి సమావేశం నిర్ణయించినట్టు చైర్మన్ డీకే ఆదికేశవులు వె ల్లడించారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆభరణాల చారిత్రక నేపథ్యం, విలువను బట్టి బీమా చేయాలా? భక్తుల విశ్వాసాలతో కూడిన ఆభరణాలను ఏ కంపెనీ ద్వారా బీమా చేయాలి? అనే విషయాల అధ్యయనం తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. చివరి సమావేశంలో టీటీడీ చైర్మన్ డీకే ఆదికేశవులు, ఈవో కృష్ణారావు, సభ్యులు ఇందిర, రౌతు సూర్యప్రకాష్రావు, ఆలూరు సుబ్రమణ్యం, చెరకు ముత్యంరెడ్డి, యాదయ్య, అంజయ్య, సత్యనారాయణ, ఎండోమెంట్ కమిషనర్ జేఎస్వీ.ప్రసాద్ హాజరయ్యారు. |
| సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు |
|
|
|
టీటీడీ అనుబంధ ఆలయాల్లో కొత్తగా 52 మంది అర్చకులు, 22 మంది పరిచారకులు, 25 మంది వేద పారాయణం చేసేవారిని నియమించాలని నిర్ణయించారు.
టీటీడీ ఉద్యోగుల్లో ఆరుగురికి డిప్యూటీ ఈవోలుగా పదోన్నతికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన విభాగంలో ఈ కొత్తపోస్టులు కల్పిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆరుగురు డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారులను టీటీడీకి తీసుకురావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వీరిలో సూర్యకుమారి టీటీడీలోని సర్వీసెస్ విభాగంలో బాధ్యతలు స్వీకరించారు. త్వరలో మరో ఐదుగురు రానున్నారు.
టీటీడీ ఉద్యోగులకు పిలిగ్రిం కాంపెన్సేషన్ అలవెన్సు రూ.1,000 నుంచి రూ.1,500కు పెంచారు. ఈ నిర్ణయం నవంబర్ 2010 నుంచి అమల్లోకి వస్తుంది.
దేవస్థానం డ్రైవర్లకు రాత్రి అలవెన్స్ రూ.80 నుంచి రూ.150, కిలోమీటరుపై భత్యం 50 పైసలు నుంచి రూపాయికి, గరిష్టంగా చెల్లించే మొత్తాన్ని రూ.60 నుంచి రూ.120 పెంపు.
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుచానూరులోని పోటు కార్మికులు సొసెటీగా ఏర్పడితే కాంట్రాక్టర్తో సంబంధం లేకుండా టీటీడీ నేరుగా జీతాలు చెల్లించాలని తీర్మానించారు.
ఇప్పటికే తొలగించిన 60 ఏళ్లకు పైబడిన వారిలో కొందరిని అత్యవసరం అనుకుంటే సలహాదారులుగా తీసుకోవాలని నిర్ణయించారు.
కేంద్ర ధార్మిక సలహా మండలిలో పలువురిని సభ్యులుగా నియమించారు. ఇప్పటికే చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాంబాబు నియమితులయ్యారు. తాజా నిర్ణయంతో సభ్యులుగా వివిధ రంగాలకు చెందిన జస్టిస్ వై.భాస్కరరావు, వేదవతి ప్రభాకర్రావు, సుబ్బారావు, కందాడై రామానుజార్యులు, డాక్టర్ పార్థసారధి, వేల్కూరి కృష్ణన్, దొండపాటి శంకర్రావు, ఐ.మల్లిఖార్జునరావు, చంద్రశేఖర్రావు, ఆర్.అప్పారావు, ప్రేమ్ సిద్ధాంతి, కె.శివానందమూర్తి ఉన్నారు.
శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలోని అభిషేకం టికెట్ రూ.100 నుంచి రూ.500లకు పెంచనున్నారు.
టీటీడీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
శ్రీ పద్మావతి నగర్లో కొత్తగా నిర్మించిన మూడు అతిథి గృహాల అద్దె ఖరారు.
టిక్కెట్లు తితిదేకి.. సొమ్ములు వేద పరిషత్కు : పాలకమండలి సభ్యురాలు ఇందిర నిర్ణయం తితిదే పాలకమండలి సభ్యురాలు, దేవస్థానం మాజీ ఛైర్మన్ టి.సుబ్బిరామరెడ్డి సతీమణి టి.ఇందిర ఆర్జితం టిక్కెట్ల అక్రమాల వూబి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేపట్టారు. తన మనుమలు టి.రాజీవ్రెడ్డి, టి.అనిరుద్రెడ్డిల పేర్లతో దశాబ్దాలపాటు నమోదు చేసుకున్న టిక్కెట్లను తితిదేకు అప్పగించేశారు. 'ఉదయాస్తమాన సేవ టిక్కెట్ల కోసం మా మనువల పేరుతో దరఖాస్తు చేసుకున్నాం. ఒక్కొక్కరి పేరున రూ.పది లక్షలు చెల్లించాం. నెలల తరబడి ఎదురుచూశాం. ఆ సేవలు అందుబాటులో లేకపోవడంతో మాకు వస్త్రాలంకరణ సేవల టిక్కెట్లు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.
అప్పట్లో ఉన్న నిబంధనల ప్రకారం సేవా టిక్కెట్లు కేటాయిస్తామని చెప్పడంతో సరేనన్నాం. ఇటీవలికాలంలో మమ్మల్ని కించపరిచే విధంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాకు కేటాయించిన టిక్కెట్లను తితిదేకు తిరిగి అప్పగించాలని నిర్ణయించాం. ఆ సొమ్ములు రూ.20 లక్షలు వేద పరిరక్షణ ట్రస్టుకు అప్పగిస్తున్నాం..' అంటూ పాలకమండలి సమావేశం ప్రారంభం కావడానికి ముందే మీడియాకు ఆమె ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకారమే సమావేశం అనంతరం టిక్కెట్లను తితిదే ఈవోకు మీడియా ఎదుట అప్పగించారు. |
|