టిటిడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ అభ్యర్థులు సవాలక్ష సవాళ్లను అధిగమించవలసి వచ్చింది . దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుద్యోగ అభ్యర్థి ఆన్లైన్లో పంపించేందుకు రూ. 30 లు ఇంటర్నెట్ సెంటరుకు సమర్పించుకొనవలసి వచ్చింది. దీనితో బాటు ఓపన్ కేటగిరి అభ్యర్థులు రూ. 200 లు , ఇతరులు రూ.100 స్టేట్బ్యాంకులో చలాన తీసుకొనడం నిరుద్యోగులకు అనివార్యం అయింది. బ్యాంకులు , బీమా సంస్థలు , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఫీజుల విషయంలో ఏలాంటి రాయితీ ఉండదు. కోట్లకు పడగలెత్తిన తిరుమల వెంకన్నకు నిరుద్యోగులు కష్టపడి చెల్లించే దరఖాస్తు ఫీజు పెద్ద లెక్కలోకి రాదు. శ్రీవారి సేవకు పోటీ పడుతున్న నిరుద్యోగులకు ఉచితంగా దరఖాస్తు పంపుకొనేందుకు టిటిడి వీలు కల్పించడం సముచితం. నిరుద్యోగులకు ఒకింత ఊరట కలిగి ఉండేది. ఈ విషయంలో టిటిడి పాలక వర్గం పునరాలోచించి నిరుద్యోగులు చెల్లించిన దరఖాస్తు ఫీజును తిరిగి వారికి చెల్లించడం ఆవశ్యం. భవిష్యత్తులో టిటిడి సంస్థ చేపట్టనున్న ఉద్యోగాల ప్రక్రియలో నిరుద్యోగులకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడుతుందని ఆశించవచ్చును. ప్రవేశపరీక్షపై ఉత్కంఠం టిటిడి ఉద్యోగ నియామకాలపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దళారులు రంగ ప్రవేశం చేసి ప్రతి ఉద్యోగానికి రేటు ఖరారు చేసినట్లు సమాచారం. టిటిడి ఉద్యోగులను ఇప్పిస్తామని రూ. 5 లక్షలు ముట్టచెపితే ఉద్యోగం గ్యారంటీ అని నిరుద్యోగులను నమ్మించేందుకు దళారులు రంగ ప్రవేశం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా టిటిడి ఉద్యోగాలకు ప్రవేశ పరీక్ష సమీప భవిష్యత్త్తులో ఉండకపోవచ్చని టిటిడి వర్గాలు వెల్లడిస్తున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు తరువాతనే ప్రవేశ పరీక్ష ఉంటుందని వినికిడి. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా నియామకాలు జరుగుతాయని టిటిడి కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో వెల్లడించడం కొసమెరుపు.
|