తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలు కరిగించారని కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో పురాతన ఆభరణాలు ఏ కాలంనాటివో గుర్తించేందుకు టిటిడి రంగంలోకి దిగింది. పురావస్తుశాఖకు చెందిన ఐదుగురు నిపణుల బృందం బుధవారం నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. శ్రీ కృష్ణదేవరాయలు తిరుమలేశునికి సమర్పించిన కానుకల్లో కొన్నింటిని కరిగించారనీ , మరికొన్ని మాయమయ్యాయని ఇటీవల పుకార్లు చెలరేగిన విషయం తెలిసిందే. స్వామివారి ఆభరణాలన్నీ భద్రంగానే ఉన్నాయనీ , ఇందులో కృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాలేవో గుర్తించే శక్తి తమకు లేదని టిటిడి ప్రకటించింది. పురాతన ఆభరణాలను పరిశీలించి అవి ఏకాలం నాటివో గుర్తించడానికి పురావస్తు నిపుణులను రప్పిస్తామని చెప్పింది. ఈ మేరకు ఈవో కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వానికి , పురావస్తుశాఖ డైరెక్టర్కు లేఖలు రాశారు. దీంతో పురావస్తుశాఖ ఐదుగురు అధికారులు బృందానికి ఈ పని అప్పగించింది. ఈ బృందం బుధవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో జేఈవో యువరాజ్ ట్రెజరీ , ఆలయ విబాగాల అధికారులతో సమావేశమైంది. దేవస్థానం వద్ద ఉన్న పురాతన ఆభరణాలకు సంంధించిన చారిత్రక శాసనాలను టిటిడి రికార్డుల్లోని వివరాలతో సరిపోల్చి ఆభరణాలు ఏకాలం నాటివో గుర్తించేందుకు నిర్ణయించారు. ఆభరణాల గుర్తింపు ప్రక్రియ ఎలా ఉండాలి , ఎలా చేయాలి ? దీని విధి విధానాలు ఎలా ఉండాలనే దానిపై అధికారులతో ఈ బృందం చర్చించింది. రెండు , మూడు రోజుల్లో ఆభరణాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించేందుకు నిర్ణయించాలని తెలిసింది. పురావస్తు శాఖకు చెందిన ఇంకొందరు సిబ్బంది రెండు , మూడురోజుల్లో తిరుమలకు రానున్నట్లు సమాచారం.
|