లోక కల్యాణం కోసం తిరుమలలో ఆదివారం చాతుర్మాస వ్రతదీక్ష ప్రారంభమైంది. సంసార బంధం నుంచి విముక్తి పొంది సన్యాసం స్వీకరించి జపతపాలు నిర్వహించడమే ఈ వ్రతం ముఖ్య ఉద్దేశం. ఈ దీక్షచేసేవారు నాలుగు నెలలపాటు మరో ప్రాంతానికి వెళ్ళకుండా కొనసాగించడం విశేషం. తిరుమలలోని పెద్దజీయర్ మఠంలో శ్రీ పెరియకెళ్లి అప్పన్ రామానుజ ఆధ్వర్యంలో చాతుర్మాసవ్రత దీక్ష నిర్వహించారు. కుర్తాలం సిద్దేశ్వరపీఠంలో జగద్గురు శ్రీ సిద్దేశ్వర ఆనంద భారతీస్వామి , మళయాళస్వామి మఠంలో శ్రీపరిపూర్ణానంద స్వామి నేతృత్వంలో ఈ దీక్ష చేపట్టారు. ప్రతిఏటా గురుపూర్ణిమ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆ భూమిపూజ , పుణ్యాహవచనం , మృత్యంగ్రహణం , సంకల్పం నిర్వహించి ఈ వ్రతానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మన్ డీకే ఆదికేశవులు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. అలాగే ఆయన కొత్తగా నిర్మాణం చేపట్టిన సిద్దేశ్వర పీఠాన్ని ఆదివారం ప్రారంభించారు. కుర్తాలం పీఠం ఆ«ధ్వర్యంలో చాతుర్మాస వ్రతం నిర్వహించడం విశేషమన్నారు. టిటిడి పాలకమండలి ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో టిటిడి ఈవో కృష్ణారావు , సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
|