| వికలాంగులు, వయో వృద్ధులు, చిన్న పిల్లల తల్లులకు, వ్యాధిగ్రస్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు వున్నాయా? |
| వికలాంగులు, వయో వృద్ధులు, చిన్న పిల్లల తల్లులు శ్రీవారిని దర్శనం చేసుకోవటానికి ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు వున్నాయా? గుండె జబ్బులు వంటి ప్రాణాపాయ జబ్బులు వున్న వారికి కూడా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు వున్నాయి? వుంటే ఆ వివరాలు తెలపండి. అందుకు మేము ఏదైనా ఛార్జీలు చెల్లించాలా? ఈ వివరాలను తెలిపగలరు. |
|
వయోవృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పలు సంవత్సరాలుగా టిటిడి చేస్తోంది. ఇటీవల కాలంలో చంటి బిడ్డల తల్లులకు సయితం మహద్వారం గుండా దర్శనానికి అనుమతినిస్తున్నారు. వయోవృద్ధులు, వికలాంగులు ప్రాణాపాయ వ్యాధులున్న వారు చంటిపిల్లల తల్లులు ప్రత్యేక దర్శనానికి వెళ్లాలంటే ఏం చేయాలంటే... 1. ఆలయం ఎదురుగా మీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లో వేచి వుండాలి. 2. మీరు అక్కడ వేచి వుంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆలయం ముందు నుంచే నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఏఏ సమయంలో వయోవృద్ధులను, వికలాంగులను, చంటిపిల్లల తల్లులను ప్రత్యేకగా మహద్వారం ద్వారా దర్శనానికి అనుమతి ఇచ్చేది అక్కడే ఏర్పాటు చేసిన బోర్డులో కూడా రాసి వుంటుంది. 3. ఇలా ప్రత్యేకంగా దర్శనానికి వెళ్లే వారితో పాటు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని పంపటానికి వీలైతే పంపుతారు. లేదా టిటిడి ఉద్యోగుల్లో ఎవరో ఒకరు గానీ, శ్రీవారిసేవకుల్లో ఎవరో ఒకరు గానీ వికలాంగులకు తోడుగా వెళ్లి దర్శనం తర్వాత తిరిగి తీసుకువచ్చి వదులుతారు.
క్యూలో వేచి వుండాల్సిన పని లేదు... 4. అంటే మహద్వారం ద్వారా ప్రత్యేకంగా దర్శనానికి వెళ్లే వారు సాధారణ భక్తుల్లా క్యూకాంప్లెక్స్లో గంటల కొద్ది సమయం వేచి వుండి, పెద్ద క్యూ ద్వారా రావాల్సిన అవసరం వుండదు. ఆలయం లోపల వెండి వాకిలి వద్ద వున్న ధ్వజస్తంభం నుంచి వున్న క్యూ నుంచి మాత్రం మిగతా భక్తులతో పాటు సుమారు ఓ 15 నిమిషాలు మాత్రం క్యూలో వెళ్లాల్సి వుంటుంది. 5. మహద్వారం ద్వారా దర్శనానికి వెళ్లే వీరికి 5 రూపాయలకు ఇచ్చే లడ్డూ ప్రసాదం టోకన్ను ఇస్తారు. 5 రూపాయలు చెల్లించి ఈ టోకన్ను పొందవచ్చు.
ప్రాణాపాయం వున్న వారికి కూడా ప్రత్యేక ప్రవేశం... వికలాంగులు ఏ వయస్సు వారైనా ఆలయంలోకి ప్రత్యేకంగా మహద్వారం ద్వారా అనుమతిస్తున్నట్టే, ప్రాణాపాయ వ్యాధులున్న వారు సయితం ఏ వయస్సు వారైనా, వారిని కూడా టిటిడి మహద్వారం గుండా ప్రత్యేకంగా అనుమతి ఇస్తుంది. అయితే వ్యాధి గ్రస్తులు తప్పకుండా సరైన రుజువులను టిటిడి సిబ్బందికి చూపాల్సి వుంటుంది.
మర్యాద పూర్వకంగా ఏర్పాట్లు... ప్రత్యేక దర్శనం వద్ద అమర్యాదగా టిటిడి సిబ్బంది ప్రవర్తిస్తున్నారని కలియుగ నారద ద్వారా భక్తులు టిటిడి ఇ.ఓకు రాసిన లేఖకు కూడా ఇ.ఓ రమణాచారి తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక దర్శనానికి అనుమతించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని తిరుమల జె.ఇ.ఓను ఆదేశించారు. వ్యాధిగ్రస్తుల పేరుతో దుర్వినియోగం జరగకుండా, త్వరలో ఆలయం ముందు ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని కూడా పెట్టాలని చూస్తున్నారు. |
|
|
శ్రీవారి సేవలో... |
| కలియుగ నారద బృందం | |
|